Chiranjeevi: ఏం చేయాలో అర్థం కావడం లేదన్న అల్లు అరవింద్ కు.. నేను ఒక మాట చెప్పా: చిరంజీవి

  • 'గీత గోవిందం' లీక్ పై అరవింద్ బాధ పడ్డారు
  • 'అత్తారింటికి దారేది' కూడా లీకైంది.. ఇది కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని చెప్పా
  • సినిమాలను పైరసీ చేయడం చాలా దారుణం

సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. కోట్లాది రూపాయల పెట్టుబడి, వందలాది మంది శ్రమ... ఈ పైరసీగాళ్ల వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా... అది మరింతగా పంజా విసురుతోంది. తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న 'గీత గోవిందం' సినిమా కూడా రిలీజ్ కంటే ముందుగానే దాదాపు గంటన్నర నిడివి లీక్ అయింది. దీంతో యూనిట్ సభ్యులు తీవ్రంగా కలత చెందారు.

నిన్న 'గీత గోవిందం' సక్సెస్ మీట్ లో చిరంజీవి ఇదే అంశంపై మాట్లాడారు. దాదాపు గంటన్నర సినిమా లీకైపోయిందని... ఏం చేయాలో అర్థం కావడం లేదని అల్లు అరవింద్ తనతో ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అప్పుడు ఆయనకు తాను ఒక మాట చెప్పానని... పవన్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' కంటెంట్ కూడా లీకైందని, అయినా సినిమా సూపర్ హిట్ అయిందని... ఈ సినిమా కూడా ఆ స్థాయిలో హిట్ అవుతుందని సెంటిమెంట్ గా అనుకో అని చెప్పానని తెలిపారు. లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధిని చూపించే సినిమాలను పైరసీ చేయడం దారుణమని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News