Cricket: రాజస్థాన్‌లో దారుణం.. బ్యాటింగ్ విషయంలో వివాదం... కత్తితో స్నేహితుడిని పొడిచి చంపిన యువకుడు!

  • క్రికెట్‌లో స్నేహితుల మధ్య గొడవ
  • కత్తితో స్నేహితుడిని పొడిచిన యువకుడు
  • పోలీసుల అదుపులో నిందితుడు

క్రికెట్‌లో బ్యాటింగ్ కోసం జరిగిన గొడవలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాజస్థాన్‌లో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ కుమార్ సింగ్ (17) నీట్ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని ‘కోటా’లో మూడేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నాడు. శనివారం సాయంత్రం మిత్రుడు రాహుల్ భటీతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.

క్రికెట్ ఆడుతుండగా తనకు బ్యాటింగ్ ఇవ్వాలని స్నేహితులను అతుల్ కోరాడు. సరేనంటూ వారు అతడికి బ్యాటిచ్చారు. కొంతసేపు ఆడిన తర్వాత బ్యాట్ తిరిగి ఇచ్చి ఫీల్డింగ్ చేయాలని కోరారు. అందుకు అతుల్ ఒప్పుకోలేదు. మరికొన్ని బంతులు వేయాలని కోరాడు. దీంతో వారి మధ్య చిన్నగా గొడవ మొదలైంది. అదికాస్తా, పెద్దది కావడంతో రాహుల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన వద్ద ఉన్న కత్తితో అతుల్ పొట్టలో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన అతుల్‌‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రాహుల్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

More Telugu News