telugu: అమెరికాలో ఏపీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

  • మేరీల్యాండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న సురేష్
  • కారులో అనుమానాస్పద రీతిలో మృతి
  • తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన స్నేహితులు

అమెరికాలో మరో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి చెందిన బోళ్ల వీర వెంకట సురేష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. సురేష్ వయసు 35 ఏళ్లు. చెన్నైలో బీటెక్ పూర్తి చేసిన సురేష్... అక్కడే కొంతకాలం పని చేశాడు.

అనంతరం హైదరాబాదులోని టీసీఎస్ సంస్థలో పని చేసి, రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం ఆయన మేరీల్యాండ్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. కారులో సురేష్ చనిపోయి ఉండటాన్ని గమనించిన స్నేహితులు ఆయన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కొడుకు ఇక లేడన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని బంధువులు కోరుతున్నారు. సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News