Chandrababu: మేనిఫెస్టోలోని అన్ని అంశాలను నాలుగేళ్లలో పూర్తి చేశాం: సీఎం చంద్రబాబు

  • చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • ఇది ఎన్నికల ఏడాది.. అందరిలో ఉత్సాహం కనిపించాలి
  • ‘గ్రామ వికాసం’పై సమీక్షలో చంద్రబాబు

తమ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను నాలుగేళ్లలో పూర్తి చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ‘గ్రామ వికాసం’పై ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గ్రామ వికాసం కార్యక్రమం చేపట్టి నెలరోజులు గడిచిందని, ఇరవై శాతం కార్యక్రమాలు మాత్రమే గ్రామాల్లో జరిగాయని, డిసెంబరు లోపు అన్ని గ్రామాలు, వార్డుల్లో కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

  క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు పర్యటించాలని, ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉందని, వారానికి మూడు రోజుల చొప్పున 60 రోజులే ఉందని అన్నారు. ఆ అరవై రోజుల్లో అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజలను చైతన్యపరచాలని, నాలుగేళ్లలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో, వార్డుల్లో ఇంకా చేయాల్సిన పనులేమైనా ఉంటే గ్రామస్తులను అడిగి తెలుసుకోవాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాకబు చేయాలని, వాటన్నింటినీ క్రోడీకరించి నివేదికలు పంపాలని ఆదేశించారు. పనులన్నీ తమ పార్టీ చేసిందని చెప్పుకుంటూ, గర్వంగా కార్యకర్తలు తిరగాలని, ఇది ఎన్నికల ఏడాది కనుక, అందరిలో ఉత్సాహం, చురుకుదనం కనిపించాలని ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు.

More Telugu News