Chandrababu: వాజ్ పేయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన చంద్రబాబు!

  • న్యూఢిల్లీకి వచ్చి నివాళులు అర్పించిన చంద్రబాబు
  • హైటెక్ సిటీని ప్రారంభించారని గుర్తు చేసుకున్న చంద్రబాబు
  • మహానేతను కోల్పోయామని వ్యాఖ్య

మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఉదయం న్యూఢిల్లీలోని వాజ్ పేయి నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు, ఆపై మీడియాతో మాట్లాడారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే తాను సీఎంగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.

1998లో తాను హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తే ఆయన వచ్చారని, వాంబే (వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన) పథకానికి ఏపీ నుంచే అంకురార్పణ జరిగిందని చెప్పారు. తాను అడగ్గానే ఎంఎంటీఎస్, శంషాబాద్ ఎయిర్ పోర్టులను మంజూరు చేశారని అన్నారు. స్పీకర్ పదవికి ఓ మంచి ఎంపీని సూచించాలని కోరితే, తాను బాలయోగిని సూచించానని, మరో మాట మాట్లాడకుండా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేశారని చెప్పారు. అటువంటి మహానేతను కోల్పోవడం దేశానికి తీరనిలోటని చంద్రబాబు అన్నారు.

More Telugu News