Telangana: వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో దెయ్యం.. స్వయంగా చెప్పిన కలెక్టర్!

  • కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది రాయి వేసి 133 ఏళ్లు
  • ఇంజినీర్ జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన
  • మొదటి అంతస్తులో దెయ్యం
  • ఆమ్రపాలి చెప్పింది ఇదీ..

దెయ్యాలు ఉన్నాయా? ఈ విషయంలో ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కోలా ఉంటాయి. ఎవరి సంగతి ఎలా ఉన్నా వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో మాత్రం దెయ్యం ఉందట. అదంటే ఆమెకు భయమట కూడా. అందుకే ఆ ఇంట్లో పడుకోవడానికి సాహసించడం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె అలా ఎందుకన్నారంటే..

వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది రాయి వేసి ఆగస్టు 10తో 133 ఏళ్లు నిండింది. ఈ సందర్భంగా తాను నివాసం ఉంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో ఈ భవనానికి జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన చేశారని తెలిసిందన్నారు. దీంతో ఇంతకీ జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి తనలో కలిగిందన్నారు. దీంతో పరిశోధన చేయగా జార్జ్ పామర్ గొప్ప ఇంజినీర్ అని తెలిసిందన్నారు. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.

గతంలో ఈ భవనంలో పనిచేసిన కలెక్టర్లు ఇందులోని మొదటి అంతస్తులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి పేర్కొన్నారు. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక ఓ రోజు మొదటి అంతస్తులోకి వెళ్లి చూస్తే.. గదంతా చిందరవందరగా ఉందని, దీంతో అన్నీ నీట్‌గా సర్దిపెట్టించానని పేర్కొన్నారు. అయినా సరే అక్కడ దెయ్యం ఉందన్న భయం తనను వీడలేదని, అందుకే అక్కడ నిద్రపోవడానికి సాహసించడం లేదని ఆమె నవ్వుతూ పేర్కొన్నారు. 

More Telugu News