geetha govindam: ‘గీత గోవిందం’ సినిమా లీక్ కేసులో కీలక నిందితుడి అరెస్టు!

  • నిందితుడి పేరు పడవల రాజేశ్
  • ఫిలింనగర్ లో డేటా డిజిటల్ బ్యాంకు లో అడ్మిన్ 
  • గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు వెల్లడి

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ సినిమా లీక్ కేసును పోలీసులు ఛేదించారు. పైరసీకి పాల్పడిన చీరాలకు చెందిన పడవల రాజేష్ ను అరెస్టు చేసినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో డేటా డిజిటల్ బ్యాంకు అడ్మిన్ గా రాజేశ్ పనిచేస్తున్నాడని, ఎడిటింగ్ నిమిత్తం ఇచ్చిన హార్డ్ డిస్క్ లోని డేటాను తన ల్యాప్ టాప్ లోకి కాపీ చేసుకున్నాడని చెప్పారు.

కాపీ చేసుకున్న ఈ సినిమా వీడియోను పెన్ డ్రైవ్ ల ద్వారా తన స్నేహితులకు, అదే విధంగా, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు రాజేశ్ పంపినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు రాజేశ్ నుంచి 3 ల్యాప్ టాప్ లు, 3 పెన్ డ్రైవ్ లు, 3 హార్డ్ డిస్క్ లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ వీడియోను షేర్ చేసిన మరో ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేశామని అన్నారు. కాగా, మరోపక్క, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఇంకా విడుదల కానీ ‘ట్యాక్సీ వాలా’ చిత్రాన్ని కూడా పైరసీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

More Telugu News