bjp: బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది: కిషన్ రెడ్డి మండిపాటు

  • బీజేపీ,టీఆర్ఎస్ లు కలిసి పోయాయనడం తగదు
  • మజ్లిస్ తో చేతులు కలిపిన పార్టీతో పొత్తు పెట్టుకోం
  • టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది

కాంగ్రెస్ పార్టీపై టీ-బీజేపీ నేత కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. నల్గొండలో ఎంజీ యూనివర్శిటీలో విద్యార్థులతో కిషన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పోయాయంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మజ్లిస్ తో చేతులు కలిపిన పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని వ్యాఖ్యానించారు.

 ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్ర పథకాలను ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ పాలనలో ప్రాజెక్టు పనుల్లో పురోభివృద్ధి లేదని, ప్రభుత్వాసుపత్రుల నిర్వహణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాగా, యూనివర్శిటీలో సమస్యల గురించి విద్యార్థులను అడిగి కిషన్ రెడ్డి తెలుసుకున్నారు.  

More Telugu News