West Godavari District: దొంగను పట్టుకున్న గ్రామస్తులు... మిగతా దొంగలను పట్టుకోవాలని పోలీసులకు ఛాలెంజ్!

  • తాడేపల్లిగూడెం సమీపంలో ఘటన
  • నవాబుపాలెంలో వరుస దొంగతనాలు
  • మాటేసి ఒకరిని పట్టుకున్న ప్రజలు
  • మిగతా ఇద్దరినీ తేవాలని పోలీసులకు సవాల్

తమ ఊరికి దొంగతనానికి వచ్చిన దొంగల్లో ఒకడిని బంధించిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నవాబుపాలెం గ్రామస్తులు, మిగతా దొంగలను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ చేస్తూ, అంతవరకూ తమకు దొరికిన దొంగను అప్పగించేది లేదని తేల్చి చెప్పారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, గత కొంతకాలంగా నవాబుపాలెంలోని ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని మాటు వేసిన గ్రామస్తులు, వారిని ట్రాప్ చేయగా, వచ్చిన ముగ్గురు దొంగల్లో ఇద్దరు పారిపోగా, ఒకడు పట్టుబడ్డాడు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు అతడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, దొంగను అరెస్ట్ చేసేందుకు రాగా, తీవ్ర అభ్యంతరం తెలిపిన గ్రామస్థులు, పరారీలో ఉన్న దొంగలను పట్టుకురావాలని డిమాండ్ చేశారు. వాళ్లను తెచ్చిన తరువాతే తమ వద్ద ఉన్న దొంగను అప్పగిస్తామని వాగ్వాదానికి దిగారు. ఉన్న దొంగను అప్పగిస్తే, అతన్ని విచారించి మిగతా వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు నచ్చజెప్పినా గ్రామస్తులు వినలేదని తెలుస్తోంది. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News