Tollywood: జూనియర్ ఆర్టిస్టుపై సామూహిక అత్యాచారం.. నిందితుడికి సహకరించిన బాధితురాలి స్నేహితురాళ్లు!

  • డబ్బుల విషయంలో గొడవ
  • గుంటూరు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం
  • సహకరించిన బాధితురాలి స్నేహితులు

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో ఉండే జూనియర్ ఆర్టిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. డబ్బుల విషయంలో గొడవ తలెత్తగా మురో ముగ్గురితో కలిసి స్నేహితుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక, ఆ ఘటనను చిత్రీకరించి నెట్‌లో పెడతానని బెదిరించాడు. బాధితురాలి స్నేహితురాళ్లే నిందితుడికి సహకరించడం గమనార్హం. ఎస్సార్ నగర్ పోలీసుల కథనం ప్రకారం..

గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, హేమలత లంగర్‌హౌస్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్‌లో వీరి స్నేహితురాలైన మరో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటోంది. ఇటీవల ఈ యువతికి రాజ్‌కిరణ్ అనే యువకుడితో పరిచయం అయింది. ఇద్దరి మధ్య స్నేహం ముదరడంతో అతడు కూడా ఆమెకు  సమీపంలోనే ఓ హాస్టల్‌కు మారాడు.

ఈ క్రమంలో సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న జూనియర్ ఆర్టిస్టుల కోసం ఇద్దరూ కలిసి ‘మన’ అనే సంస్థను ఏర్పాటు చేసి అటువంటి వారి వివరాలు సేకరించారు.  వారందరి నుంచి సభ్యత్వం కోసం కొంత మొత్తం వసూలు చేశారు. అయితే, ఈ డబ్బుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కక్షపెంచుకున్న రాజ్‌కిరణ్ మార్చి 5న శిరీష, హేమలతతోపాటు యువతిని కూడా గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జ్‌లో రూము తీసుకుని అందులో పెట్టాడు.

అనంతరం హేమ, శిరీషలు బాధిత యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వగా, దానిని తాగిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో రాజ్‌కిరణ్ తన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చూపించి పలుమార్లు యువతిని బెదిరించాడు. అతడి వేధింపులు రోజురోజుకు పెరగడంతో యువతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News