Virat Kohli: విజయం ముంగిట బోల్తా పడటానికి కారణం బ్యాట్స్ మేనే!: విరాట్ కోహ్లీ

  • బ్యాట్స్ మెన్ల వైఫల్యమే కొంపముంచింది
  • ఆటను తనవైపు లాగేసుకున్న ఇంగ్లండ్
  • భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ

బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో విజయం ముంగిట వరకూ వచ్చి ఓటమి పాలు కావడానికి బ్యాట్స్ మెన్ వైఫల్యమే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తాము గ్యారెంటీగా గెలుస్తామని భావించామని, అయితే, ఇంగ్లండ్ అద్భుతంగా ఆడి, ఆటను తనవైపు లాగేసుకుందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన తరువాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

షాట్లను ఎంపిక చేసుకోవడంలో ఆటగాళ్లు పొరపాటు చేశారని, జట్టు ఓటమి పాలైనప్పటికీ, సానుకూల అంశాలతో రెండో టెస్టుకు సిద్ధమవుతున్నామని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు అమోఘమైన ఆటతీరును చూపించారని కితాబిచ్చాడు. ప్రతిరోజూ ఆటను తన అధీనంలోకి తీసుకోవాలని చూసిన ఇంగ్లండ్ జట్టు విజయాన్ని అందుకుందని తెలిపాడు. తమ బౌలర్లు రాణించారని, అయితే, బ్యాట్స్ మెన్లు విఫలం కావడం కొంపముంచిందని చెప్పాడు. కాగా, ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లూ కలిపి 50 కన్నా ఎక్కువ పరుగులు చేసిన వారు కోహ్లీ (200), పాండ్యా (52)లు మాత్రమే కావడం గమనార్హం.

More Telugu News