cuddapah: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు డిమాండ్.. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల ధర్నా!

  • కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ  
  • ధర్నాను అడ్డుకున్న పోలీసులు
  • సొమ్మసిల్లి పడిపోయిన ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రమేష్

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం నాలుగు రోజులుగా పాదయాత్రలు నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాలు ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశాయి. అయితే, ఈ ధర్నాను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జికి దిగారు. ఈ క్రమంలో యోగి వేమన యూనివర్శిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రమేష్ నాయక్ సొమ్మసిల్లిపడిపోయాడు.

దీంతో, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు అతన్ని తన చేతులతో ఎత్తుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు.. రమేష్ ను రిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తిరుపతి స్విమ్స్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కు చెందిన సుమారు ఇరవై మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోపక్క, ఈ సంఘటనపై వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమకారులపై దాడులకు పాల్పడటం దారుణమని విమర్శించారు.

More Telugu News