Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోరం... ప్రియుడిని మంచానికి కట్టేసి సజీవ దహనం చేసిన యువతి!

  • వివాహేతర సంబంధం పెట్టుకుని వ్యాపారం
  • ఇద్దరి మధ్యా ఆర్థిక వివాదాలు
  • మంచానికి కట్టేసి నిప్పంటించిన ప్రియురాలు

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పొదిలికి చెందిన షేక్ షబ్బీర్ (32) అనే హోమ్ గార్డుతో వివాహేతర సంబంధం పెట్టుకుని, కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్న షకీరా అలియాస్ ఇమాంబీ, అతన్ని కిరాతకంగా హత్య చేసింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కొన్ని నెలలుగా వీరిద్దరూ కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు.  

కొంతకాలంగా షబ్బీర్ సైతం విధులకు హాజరు కాకుండా ఆమెతో పాటు సహజీవనం చేస్తున్నాడు. శనివారం రాత్రి ఇద్దరూ చవటపల్లిలోని కోళ్ల ఫారానికి వెళ్లారు. ఇద్దరి మధ్యా ఏం జరిగిందో తెలియదుగానీ, కోళ్ల ఫారం నుంచి మంటలు వచ్చాయి. మంటలెందుకు వచ్చాయని స్థానికులు ప్రశ్నించగా, విద్యుత్ షార్టు సర్క్యూట్ జరిగిందని షకీరా వెల్లడించింది.

ఆపై దాని యజమాని లోనికి వెళ్లి చూడగా, షబ్బీర్ కాలిపోయిన స్థితిలో కనిపించాడు. మంచానికి అతని చేతులు, కాళ్లు గొలుసులతో కట్టేసి, వాటికి తాళం వేసి ఉంది. కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడాయన. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ ప్రారంభించారు.

More Telugu News