kesinenei nani: ఏపీలో 4 రోజులు ఉంటే .. హైదరాబాద్ లో 40 రోజులు ఉంటాడు: పవన్ పై కేశినేని ఫైర్

  • రైతుల సమస్యలపై పవన్ కు అవగాహన లేదని విమర్శ
  • ఏపీని మోసం చేసిన మోదీపై పోరాడాలని సూచన
  • బాబుపై బీజేపీ కుట్రలో కేసీఆర్, గవర్నర్ భాగస్వాములని ఆరోపణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. పవన్ కు అసలు రైతుల సమస్యల గురించి ఎంతమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈ రోజు నాని మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం పోరాడుతున్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం మానేయాలని పవన్ కు హితవు పలికారు. పవన్ నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తే.. 40 రోజులు హైదరాబాద్ లో ఉంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కాకుండా ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిన ప్రధాని మోదీపై పోరాడాలని పవన్ కు నాని సూచించారు.

పవన్ కల్యాణ్ నిజంగా సీరియస్ రాజకీయ నాయకుడు కాదనీ, ఆయన మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు లక్ష్యంగా బీజేపీ పన్నిన కుట్రలో కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లు భాగస్వాములయ్యారని ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని తొలుత చెప్పిన కేంద్రం ఇప్పుడు జోన్ అసాధ్యమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమన్నారు. 

More Telugu News