Andhra Pradesh: అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా నిలిపేందుకు వీల్లేదు: ఏపీ మంత్రి సునీత ఆదేశాలు

  • నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం
  • చిన్న కారణాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది
  • ఇకపై అలా జరగకుండా చూసుకోవాలి

ఏపీలోని అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా నిలపడానికి వీల్లేదని స్త్రీ, శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్, మంత్రి సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ‘అన్న అమృతహస్తం’, ‘బాలామృతం’ పథకాల ద్వారా గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. జులైకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు అంగన్ వాడీ సెంటర్లకు చేరకపోవడానికి గల కారణాలు సప్లయ్ దారులను సునీత అడిగి తెలుసుకున్నారు.

జులై 2017 నుండి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని జులై 15, 2018 తో గడువు పూర్తయిందని సప్లయ్ దారులు సునీత దృష్టికి తెచ్చారు. కోడిగుడ్ల సరఫరాను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గడిచిన ఐదు నెలలుగా సరఫరా చేసిన కోడిగుడ్లకు బిల్లులు ఇంకా చెల్లించకపోవడంతో కొనుగోలు శక్తి లేక సరఫరా చేయలేకపోయామని, లారీల బంద్ తో కొన్ని జిల్లాలలో సరఫరా జరగలేదని సప్లయ్ దారులు వివరించారు.  

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, నెలాఖరులోపు బకాయిలు మొత్తం చెల్లిస్తామని, చిన్నకారణాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఇకపై అటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్ల సైజు చిన్నగా ఉండడం, పాడైపోయిన గుడ్లు రావడం లాంటివి ఇకపై జరగకుండా చూసుకోవాలని సప్లయ్ దారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కోడిగుడ్ల సైజు, వాటిపై స్టాంపు తప్పని సరిగా ఉండేలా చూడాలని, స్టాంప్ లేకుండా వచ్చిన కోడిగుడ్లకు బిల్లు చెల్లించడం జరగదని, దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.కోడిగుడ్ల సరఫరాలో అవకతవకలకు తావులేకుండా చూసేందుకు మొబైల్ యాప్ తయారు చేయడం జరిగిందని, అంగన్ వాడీ సెంటర్ లో గుడ్లు తీసుకున్న వెంటనే అంగన్ వాడీ వర్కర్ బయోమెట్రిక్ వేసి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న తప్పులకు ఆ నెలంతా బిల్లులు నిలిపివేస్తుండటం ఇబ్బందిగా ఉందని సప్లయ్ దారులు సునీత దృష్టికి తెచ్చారు.  

ఇటువంటి వాటిపై విచారణ చేసిన అనంతరం చెల్లించాలని, టెండర్ ప్రాసెస్ మూడు నెలలు కాకుండా ఒక నెలలో పూర్తయ్యేలా చూడాలని సప్లయ్ దారులు సునీతను కోరారు. తెలంగాణా ఫుడ్స్ నుండి ప్రభుత్వం తీసుకుంటున్న ‘బాలామృతం’ అగ్రిమెంట్ గడువు ముగుస్తున్నందున సప్లై నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు సూచించారు.

More Telugu News