Salman Khan: ’మేడమ్ టుస్సాడ్స్‘ లో దీపికకు చోటు!

  • లండన్ లోని ప్రధాన కార్యాలయంలో మైనపు విగ్రహం ఏర్పాటు
  • అభిమానులతో వివరాలు పంచుకున్న పొడుగుకాళ్ల సుందరి
  • షారుక్, సల్మాన్, మాధురి, కత్రినాల సరసన చోటు 

పద్మావతి, బాజీరావ్ మస్తానీ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునేకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు ప్రతిమ కొలువుదీరనుంది. ఇందులో భాగంగా సోమవారం ముంబైకి చేరుకున్న టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు.. దీపిక ముఖం, శరీర కొలతలతో పాటు జుట్టు రంగు తదితర అంశాలను నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని దీపిక స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. దీనికి సంబంధించి చిత్రవిచిత్రమైన హావభావాలున్న ఫొటోలతో పాటు 11 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఆమె పోస్ట్ చేసింది.

ఎంతో గర్వంగా ఉంది..

తాను చిన్నప్పుడు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లాననీ, కానీ ఇప్పుడు ఏకంగా తన విగ్రహం అక్కడ ఏర్పాటు కానుండటం ఎంతో గర్వంగా ఉందని దీపిక చెప్పింది. మ్యూజియం ప్రతినిధులు కొలతలు తీసుకునే కార్యక్రమం సరదాగా సాగిందని వ్యాఖ్యానించింది. కేవలం సినిమాలే కాకుండా ఇలాంటి వాటి వల్ల అభిమానులకు మరింత దగ్గర కావచ్చని దీపిక అభిప్రాయపడింది. తాను ఇంతస్థాయికి చేరుకోవటానికి కారకులైన అభిమానులు, ప్రేక్ష‌కులకు జీవితాంతం రుణపడి ఉంటానని దీపిక తెలిపింది. ప్రస్తుతం లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖ క్రికెటర్ సచిన్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, మాధురీ, కరీనా, కత్రినా కైఫ్ తదితరుల మైనపు విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి.

More Telugu News