vijay devera konda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ!

  • కేటీఆర్ కు రూ.25 లక్షల చెక్కు అందజేత
  • విజయ్ దేవరకొండను అభినందించిన కేటీఆర్
  • వేర్వేరు ట్వీట్లు చేసిన కేటీఆర్, విజయ్

టాలీవుడ్ యువనటుడు విజయ్ దేవరకొండ తన తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వేయగా వచ్చిన డబ్బును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారమే, విజయ్ ఆ డబ్బును అందజేశారు. తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాదులోని ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసి ఈ చెక్కును ఆయనకు అందజేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను కేటీఆర్ అభినందించి, ఓ మొక్కను అందజేశారు. తెలంగాణలో జరగనున్న నాల్గో విడత హరితహారంలో, జలం-జీవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఇంకుడు గుంతల నిర్మాణంలో విజయ్ ని పాల్గొనాలని కోరారు. ఆయా విషయాలపై ప్రజలను చైతన్య పరచాలని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు విజయ్ చెక్కు అందజేసిన విషయాన్ని కేటీఆర్ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఇదే విషయాన్ని విజయ్ కూడా తన ట్వీట్ లో తెలిపారు. కాగా, అర్జున్ రెడ్డి’ చిత్రంలో నటనకు గాను విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును ఇటీవల సొంతం చేసుకున్నాడు. ఆ అవార్డును వేలం వేసి సీఎం రిలీప్ ఫండ్ కు ఇస్తానని ప్రకటించాడు. ఆ అవార్డును వేలం వేసే పనిలేకుండా దివీస్ లేబొరేటరీస్ సంస్థ అధినేత కిరణ్ సతీమణి శకుంతల ఈ అవార్డుకు రూ.25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. 

More Telugu News