santhosh sobhan: మరో ప్రేమకథగా 'పేపర్ బాయ్' .. టీజర్ రిలీజ్

  • నిర్మాతగా మారిన సంపత్ నంది 
  • యూత్ మెచ్చే 'పేపర్ బాయ్'
  • నాయకా నాయికల నూతన పరిచయం

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కంటెంట్ వుండాలేగానీ పెద్ద సినిమాలతో సమానంగా వసూళ్లను రాబడుతున్నాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలకి ప్రేక్షకులు పెద్దపీట వేస్తుండటం వలన వీటి ఆదరణ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే 'పేపర్ బాయ్' సినిమా రూపొందింది. దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి .. సంపత్  నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు.

ఈ సినిమా ద్వారా దర్శకుడిగా జయశంకర్ .. హీరో హీరోయిన్లుగా సంతోష్ శోభన్ .. రియా సుమన్ లు పరిచయమవుతున్నారు. ముఖ్యమైన పాత్రలో తన్యా హోప్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. నాయకా నాయికలకి సంబంధించిన దృశ్యాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.

"అయిదున్నర అడుగుల సంప్రదాయం తను .. 50 కిలోల తెలుగుతనం తను .. అందుకే అయిదేళ్లుగా ఆ ఇంటికి ప్రతిరోజు వెళ్లి చూసి గుడ్ మార్నింగ్ చెప్పి వస్తున్నాను" అంటూ పేపర్ బాయ్ గా హీరో వాయిస్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తోంది. 

More Telugu News