Sri Lanka: ప్రపంచ ప్రఖ్యాత గాలె క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్న శ్రీలంక!

  • స్టేడియం పెవిలియన్‌తో డచ్ కోటకు ముప్పు
  • యునెస్కో గుర్తింపును వదులుకోవడాన్ని ఇష్టపడని ప్రభుత్వం
  • స్టేడియం కూల్చివేతకు రంగం సిద్ధం

ప్రపంచంలోని మేటి క్రికెట్ స్టేడియాలలో ఒకటైన శ్రీలంకలోని గాలె స్టేడియం ఇక కనుమరుగు కానుంది. ఈ స్టేడియం పెవిలియన్ స్టాండ్ కారణంగా యునెస్కో గుర్తింపు పొందిన 17వ శతాబ్దం నాటి కోటకు ముప్పు పొంచి ఉండడంతో దానిని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక శాఖా మంత్రి విజేయదాస రాజపక్సే పార్లమెంటుకు తెలిపారు. స్టేడియం పెవిలియన్ కారణంగా కోటకు ముప్పు పరిణమించిందని, పెవిలియన్‌ను అనధికారికంగా నిర్మించారని పేర్కొన్నారు. మనకు స్టేడయం కావాలో, యనెస్కో గుర్తింపు కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ప్రభుత్వం గాలెలో మరో స్టేడియంను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. 2004లో సునామీ కారణంగా స్టేడియం చాలా వరకు ధ్వంసమైంది. దీంతో పునరుద్ధరణ పనుల్లో భాగంగా 2008లో పెవిలియన్ నిర్మించారు. ఇప్పుడు అదే స్టేడియం కూల్చివేతకు కారణం అవుతోంది. ఈ పెవిలియన్ కోటకు ముప్పుగా మారిందని ప్రభుత్వం తెలిపింది.

గాలె స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. 1998 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆడిన మ్యాచుల్లో అత్యధిక శాతం మ్యాచులను శ్రీలంక గెలుచుకుంది. గత వారం కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే 278 పరుగుల భారీ తేడాతో శ్రీలంక గెలిచింది. అయితే, స్టేడియాన్ని ఇప్పటికిప్పుడు కూల్చబోమని క్రీడల మంత్రి ఫెయిస్‌జెర్ ముస్తాఫా తెలిపారు.

ఇకపోతే, 1505లో శ్రీలంకకు వలస వచ్చిన పోర్చుగీసువారు ఈ కోటను నిర్మించారు. 1796లో ఈ కోటను బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News