Chandrababu: హీరో శివాజీ, చలసాని శ్రీనివాస్ లను నడిపిస్తున్నది చంద్రబాబే: సోము వీర్రాజు

  • రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబే ప్రధాన అడ్డంకి
  • కేంద్రం వల్లే సులభతర వాణిజ్యంలో ఏపీకి తొలి స్థానం దక్కింది
  • రానున్న ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తాం

ప్రత్యేక హోదా విషయంలో హీరో శివాజీ, చలసాని శ్రీనివాస్ లను వెనకుండి నడిపిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి చంద్రబాబేనని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయాన్ని కూడా ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో అడ్డంగా దోచుకుంటున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని... మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాల వల్లే సులభతర వాణిజ్యంలో ఏపీకి తొలి స్థానం వచ్చిందని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర నిధులతోనే తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ను పూర్తి చేస్తామని... తమ నిజాయతీని శంకించవద్దని అన్నారు. విజయనగరం జిల్లాకు జాతీయ రహదారి, గిరిజన యూనివర్శిటీ, డిఫెన్స్ ప్రాజెక్టులను కేటాయించామని చెప్పారు. 2019 ఏప్రిల్ లోనే ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

More Telugu News