Tamilnadu: చెన్నైలో 11 ఏళ్ల బాలికపై రేప్ కేసులో విస్తుపోయే విషయం వెల్లడి!

  • 11 ఏళ్ల బాలికపై నెలల తరబడి అత్యాచారం
  • 66 ఏళ్ల వృద్ధుడే తొలుత ఘాతుకం
  • ఆ తర్వాత మిగతా వారికి ఆహ్వానం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై రేప్ కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల బధిర బాలికపై 17 మంది కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయం బయటపడి సంచలనమైంది. ఇప్పుడీ కేసులో మరో నిర్ఘాంత పరిచే ఘటన వెలుగుచూసింది. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సెక్యూరిటీ గార్డులు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, లిఫ్ట్ ఆపరేటర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

అయితే, బాలికపై తొలుత అత్యాచారానికి పాల్పడింది 66 ఏళ్ల లిఫ్ట్ ఆపరేటర్ అని పోలీసులు తేల్చారు. బాలిక స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం చుట్టూ సైకిల్ తొక్కుతుండగా తనతో తీసుకెళ్లిన వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులు, ఇతర నిందితులు అతడితో చేరారు. తాను అత్యాచారానికి పాల్పడిన తర్వాత మిగతా వారిని లిఫ్ట్ ఆపరేటర్ ఆహ్వానించాడని, వారు బాలికపై అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారని పోలీసులు వివరించారు.

బాధిత బాలిక నిందితులందరినీ గుర్తించిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు నేరాన్ని అంగీకరించారని, ఇద్దరు మాత్రం తాము లైంగిక వేధింపులకు గురిచేశామని అంగీకరించినట్టు పేర్కొన్నారు. కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News