odissa: పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఆపై లవర్ తో వివాహం..చివరకు మరో వ్యక్తితో వెళ్లిపోయిన యువతి!

  • ఒడిశాలో ఆశ్చర్యకర సంఘటన
  • పెద్దలు కుదిర్చిన పెళ్లి.. 2 రోజులే కాపురం చేసింది
  • లవర్ తో వివాహం..5 రోజులే కలిసుంది
  • చివరకు మరో వ్యక్తితో వెళ్లిపోయిన వైనం

తాళి కట్టిన భర్తతో రెండే రెండు రోజులు గడిపి, ఆపై తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి.. అతనితో ఐదు రోజులు మాత్రమే ఉండి.. ఇప్పుడు మరొక వ్యక్తితో వెళ్లిపోయి.. తన తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు తలవంచుకునేలా చేసింది ఓ కొత్త పెళ్లి కూతురు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ లో జరిగింది.

ఇటీవల ఓ యువతి తమ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆమె అక్కడ రెండే రోజులు గడిపింది. తర్వాత తానో యువకుడిని ప్రేమించానని అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తన భర్తకు, తల్లిదండ్రులకు ఆ యువతి చెప్పింది. పోలీసుల సమక్షంలో ఆ యువతి, ఆమె లవర్ పూల దండలు మార్చుకున్నారు.

అలా ఆ యువతి తన  రెండో భర్తతో కలిసి ఐదు రోజులు గడిపింది. మర్నాడు తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో రెండో భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సదరు యువతి బంధువులు చెబుతున్న కథనం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ యువకుడి సైకిలెక్కి ఆమె వెళ్లిపోయిందని, దానిని తాము చూశామని అంటున్నారు. 

కాగా, వారం రోజుల వ్యవధిలో ఇద్దరిని పెళ్లాడి.. ఆపై మరో వ్యక్తితో వెళ్లిపోయిన ఆ యువతి ఆచూకీ గురించి తెలుసుకునేందుకు ఆమె ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీసులు పంపారు. ఆ యువతి తన రెండో భర్తతో కలిసి ఉన్న ఫొటో మీడియాలో హల్ చల్ చేస్తోంది.

More Telugu News