Hyderabad: నెల రోజుల క్రితం ఇల్లొదిలి స్నేహితుల గదిలో ఉంటున్న యువతి ... రైలు పట్టాలపై మృతదేహం!

  • హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ వద్ద ఘటన
  • ఆత్మహత్యకు ముందు ఇద్దరు యువకులతో ఘర్షణ పడిన కావేరి
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

దాదాపు నెల రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేసిన కావేరి (17) అనే అమ్మాయి, తన స్నేహితులతో కలసి వుంటూ, పుట్టినరోజు వేడుకలు చేసుకుని, తెల్లారేసరికి రైలు పట్టాలపై విగతజీవితగా కనిపించిన ఘటన హైదరాబాద్ శివార్లలో కలకలం రేపింది. రైల్వే పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, అన్నోజిగూడకు చెందిన జంపాల కావేరి, ఘట్ కేసర్ పరిధిలోని బాలాజీ నగర్ లో స్నేహితులతో కలసి వుంటోంది. శుక్రవారం నాడు ఆమె ఉంటున్న రూమ్ లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల తరువాత తన తల్లికి ఫోన్ చేసిన కావేరి, తన కోసం ఎవరైనా ఫోన్ చేస్తే, ఇంట్లో నిద్రపోతున్నట్టు చెప్పమంది. ఏం జరిగిందని తల్లి ఆరా తీసేలోగా ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసింది.

ఆపై రాత్రి సమయంలో కావేరి, మరో ఇద్దరు యువకులు స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర్లో గొడవ పడ్డారు. దీన్ని చూసిన కొందరు స్థానికులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు కూడా. తెల్లారేసరికి కావేరి రైలు పట్టాల మధ్య విగతజీవితగా కనిపించగా, తల్లితో పాటు బంధువులకు సమాచారం అందింది. అమెతో పాటు గౌరి అనే మరో అమ్మాయి, జాన్సన్, తరుణ్ లు ఉండేవారని, తమ కుమార్తె మరణం వెనుక వారి ప్రమేయం ఉండవచ్చని, వారిని విచారించాలని బంధువులు డిమాండ్ చేశారు. కావేరి మృతికి ప్రేమ వ్యవహారం కారణమని తెలుస్తుండగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News