Uttar Pradesh: యూపీలో మరో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్.. ఆపై ఆలయంలో సజీవ దహనం!

  • నిద్రిస్తున్న మహిళపై ఐదుగురు అత్యాచారం
  • సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి సజీవ దహనం
  • యూపీలో సంచలనంగా మారిన ఘటన

మహిళలపై దారుణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. 35 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను సజీవ దహనం చేశారు. ఘజియాబాద్‌లోని రాజ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జరిగిందీ ఘటన.

ఇద్దరు పిల్లల తల్లి అయిన 35 ఏళ్ల యువతి తన ఇంట్లో నిద్రపోతుండగా శనివారం తెల్లవారుజామున ఐదుగురు దుండగులు ఆమె ఇంటిలోకి ప్రవేశించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వెళ్లిపోయారు. బాధితురాలు ఈ విషయాన్ని ఘజియాబాద్‌లో ఉండే తన భర్తకు ఫోన్ చేసి చెప్పేందుకు ప్రయత్నించింది. అతడి ఫోన్ కలవకపోవడంతో తన సోదరుడికి ఫోన్ చేసింది. అతడి ఫోనూ కలవకపోవడంతో తన కజిన్‌కు ఫోన్ చేసి జరిగిన ఘోరాన్ని వివరించింది.

అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందే, దుండగులు మరోమారు ఆమె ఇంటికి వచ్చి, ఆమెను సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి కిరోసిన్ పోసి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. బాధితురాలు ఈ ఘటనకు ముందు 100 నంబరుకు ఫోన్ చేసినా స్పందించలేదని ఆమె భర్త తెలిపాడు.

ఈ ఘటనపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రేమ్ ప్రకాశ్ మాట్లాడుతూ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఘటనా స్థలం నుంచి కొన్ని ఆధారాలు సేకరించినట్టు తెలిపారు. బాధితురాలు చివరిసారిగా మాట్లాడిన ఆడియో క్లిప్‌ను సేకరించామని, అందులో ఆమె తనపై అత్యాచారానికి పాల్పడిన వారి పేర్లు చెప్పిందని తెలిపారు. దర్యాప్తులో ఇది కీలకం కానుందన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News