junior ntr: అప్పుడు, జగదీశ్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నా: జూనియర్ ఎన్టీఆర్

  • నేను ఇంటర్ చదివే రోజుల్లో ఫోన్ వాడటం ప్రారంభించా
  • సెకండ్ హ్యాండ్ ఆల్కాటెల్ కొనుక్కున్నా 
  • ఫోన్ లేకుండా గడపడం అసాధ్యం

సెలెక్ట్ మొబైల్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

‘ఫోన్ వాడటం ఎప్పుడు ప్రారంభించారు?’ అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘నేను ఇంటర్ మీడియట్ చదివే రోజుల్లో.. జగదీశ్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ ఆల్కాటెల్ కొన్నాను’ అని చెప్పాడు.

‘ఫోన్ ఎక్కువగా వాడతారా? సెల్ఫీలు బాగా దిగుతారా?’ అని ప్రశ్నించగా..‘ప్రపంచం మారిపోయింది. ఏమీ లేకున్నా సరదాగా ఫోన్ తీసి చూస్తున్నాం..నేను కూడా అంతే. నేను అసలు ఫొటోలే దిగను. నాకు పోజ్ ఇవ్వడం నచ్చదు. అదంటే నాకు వణుకు వస్తుంది. నా భార్య కూడా నా ఫొటోలు తీస్తానని అంటుంది. కానీ, నాకేమో పోజులివ్వడం రాదు..’ అని చెప్పుకొచ్చాడు.

‘మొబైల్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు?’ అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా అలా లేనని, ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యమని, ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఎవరితోనైనా మాట్లాడటానికైనా ఫోన్ కావాల్సిందేనని, చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫోన్ లేకుండా ఉన్నానని అన్నాడు.

More Telugu News