indrakaran reddy: అంబ‌రాన్ని అంటేలా బోనాల సంబ‌రాల‌ు నిర్వహిస్తాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • బోనాల పండగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం
  • హైద‌రాబాద్ లోని 14 ప్రధాన ఆల‌యాల‌కు ప‌ట్టువ‌స్త్రాల‌ందజేస్తాం
  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామ‌ని, ఈ సంవత్సరం కూడా అంబ‌రాన్ని అంటేలా బోనాల సంబ‌రాల‌ు నిర్వహించనున్నామని, అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని బొగ్గుల‌కుంట‌లో ఉన్న ధార్మిక భ‌వ‌న్ లో బోనాల నిర్వహణ పై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, హైద‌రాబాద్ డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ రామ‌కృష్ణ‌, న‌గ‌ర స‌హాయ‌క క‌మిష‌న‌ర్లు, వివిధ ఆల‌యాల కార్య నిర్వ‌హ‌ణ అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు.  

హైద‌రాబాద్ న‌గ‌రంలోని 14 ప్రధాన ఆల‌యాల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తామ‌ని, బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు ఇత‌ర శాఖ‌ల అధికారుల‌ను స‌మ‌న్వ‌యంతో విజ‌య‌వంతంగా బోనాల పండగను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఈ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని భక్తుల‌కు సూచించారు. గంగ, జమున, తెహజీబ్ సంస్కృతికి నిల‌య‌మైన‌ హైద‌రాబాద్ న‌గ‌రంలో అందరూ ప్రశాంతంగా బోనాలు నిర్వహించుకుని, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

కాగా, ఈ నెల 15న గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిబోనం స‌మ‌ర్పించ‌డంతో ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం  వద్ద జూలై 29 న, 30న రంగము, ఏనుగు ఉరేగింపు నిర్వహించనున్నారు. ఆగష్టు 5 న లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనుండగా, ఆ మరుసటి రోజు ఉరేగింపు  నిర్వహించనున్నారు.

More Telugu News