MS Dhoni: 300 మ్యాచ్ లాడిన నేను పిచ్చోడినా?: కుల్ దీప్ యాదవ్ కు క్లాస్ పీకిన ధోనీ!

  • గత సంవత్సరం డిసెంబరులో ఘటన
  • ఫీల్డింగ్ మార్పులు అవసరం లేదన్న కుల్ దీప్
  • ఆగ్రహించిన మహేంద్ర సింగ్ ధోనీ

ఒత్తిడిలోనూ ప్రశాంతత, చిరునవ్వు చెక్కుచెదరకుండా కనిపించే మహేంద్ర సింగ్ ధోనీకి మైదానంలో కోపం తెప్పించి ఆయన ఆగ్రహానికి గురయ్యాడు కుల్ దీప్ యాదవ్. ఈ విషయాన్ని కుల్ దీప్ స్వయంగా చెప్పాడు. ఈ ఘటన గత సంవత్సరం చివర్లో ఇండోర్ లో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ లో జరిగిందట. ఇంతకీ ధోనీకి కోపం తెప్పించిన విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 260 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆపై లంక విజయం దిశగా సాగుతోంది.

ఆ సమయంలో కుల్ దీప్ కు ఫీల్డింగ్ మార్చమని సలహా ఇచ్చిన ధోనీ, కవర్స్ లో ఉన్న ఫీల్డర్ ను పాయింట్ లోకి రావాలని చెప్పగా, ఆ అవసరం లేదని కుల్ దీప్ చెప్పాడట. దీంతో ఆగ్రహించిన ధోనీ, "300 మ్యాచ్ లను ఆడిన నేను పిచ్చోడిని అనుకుంటున్నావా?" అన్నాడట. దీంతో కుల్ దీప్ వెంటనే ఫీల్డర్ ను మార్చాడు. ఆపై వికెట్ కూడా దక్కింది. ఈ ఘటన తరువాతనే తనకు ధోనీకి ఉన్న అనుభవమేంటో తెలిసివచ్చిందని, వికెట్ పడిన తరువాత ధోనీ తన వద్దకు వచ్చి, "ఇదే నేను చెప్పింది" అంటూ భుజం తట్టాడని తెలిపాడు.

More Telugu News