Amith shah: అమిత్ షా ‘గో బ్యాక్’.. బీజేపీ చీఫ్‌కు తమిళ యువత షాక్

  • అమిత్ షాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు
  • ‘‌గో ‌బ్యాక్‌ అమిత్‌ షా’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు
  • ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానం
  • జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ నేతలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తమిళ యువత తడాఖా చూపించింది. ఒక రోజు పర్యటన నిమిత్తం చెన్నై వచ్చిన ఆయనపై ‘గో బ్యాక్’ అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల నిండా నిరసనలు వెల్లువెత్తడంతో బీజేపీ కంగుతింది. సోమవారం నగరంలో అడుగుపెట్టిన అమిత్ షా పర్యటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన నెటిజన్లు  ‘గో బ్యాక్‌ అమిత్‌ షా’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు.

‘గో బ్యాక్ అమిత్ షా’ హ్యాష్ ట్యాగ్ ట్వీట్లు, రీట్వీట్లతో ట్రెండింగ్ కావడంతో బీజేపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఏకంగా 1.29 లక్షల మంది అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ ట్యాగ్ చేశారు. ఫలితంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్న వాటిలో ఇది రెండో స్థానంలో నిలిచింది. తమిళ గడ్డపైకి అమిత్ షా లాంటి ఉగ్రవాదిని అడుగుపెట్టనీయబోమని కొందరు హెచ్చరించారు. ఇది తమిళనాడు అన్న సంగతిని ఆయన గుర్తుంచుకుంటే మంచిదని కొందరు, ప్రజాస్వామ్య గ్యాంబ్లర్‌ను తాము అంగీకరించబోమని మరికొందరు కామెంట్ చేశారు. నోట్ల రద్దు స్కామ్‌ స్టార్‌ గో బ్యాక్‌ అని ఇంకొందరు అమిత్ షాపై విరుచుకుపడ్డారు. ఇలా లక్షలాదిమంది అమిత్ షాకు వ్యతిరేకంగా గళమెత్తడాన్ని రాష్ట్ర పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

More Telugu News