Mohammad Shami: క్రికెటర్ మొహమ్మద్ షమీకి దూరమైన తరువాత మళ్లీ ర్యాంప్ ఎక్కిన హసీన్ జహాన్!

  • నాలుగు నెలలుగా ఒంటరిగా ఉన్న హసీన్ 
  • గతంలో చీర్ లీడర్ గా పనిచేసిన షమీ భార్య
  • కొత్త మోడలింగ్ ఒప్పందాలు వచ్చాయని వెల్లడి

క్రికెటర్ మొహమ్మద్ షమీ నుంచి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న అతని భార్య హసీన్ జహాన్, తిరిగి ర్యాంప్ వాక్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. షమీపై సంచలన ఆరోపణలు చేసి, గత మూడు, నాలుగు నెలలుగా వార్తల్లో నిలిచిన జహాన్, తాను ఇకపై గౌరవంగా జీవించాలని నిర్ణయించుకున్నానని, తన మూడేళ్ల కుమార్తెతో కలసి ఒంటరిగా ఉంటున్నానని వ్యాఖ్యానించింది.

మరోసారి మోడలింగ్ రంగంలోకి ప్రవేశిస్తున్నానని తెలిపింది. నెలకు రూ. 10 లక్షలు భరణాన్ని తన భర్త నుంచి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిన ఆమె, గతంలో తన మరిది తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని, అతనికి షమీతో పాటు అత్తమామలు సహకరించారని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. షమీ సైతం తనను బలవంతంగా అనుభవించాలని చూశాడని, అందరూ కలసి హత్య చేయబోయారని ఆమె పెట్టిన కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.

షమీతో వివాహానికి ముందు ప్రొఫెషనల్ మోడల్ గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్ గా పని చేసిన హసీన్, 2014లో షమీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. "నా కెరీర్ మొత్తాన్ని నేను వదులుకున్నాను. నా కలలన్నీ షమీతో అనే అనుకున్నాను. కానీ అది జరగలేదు. షమీ నా కెరీర్ ను ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు నన్ను నేను నిరూపించుకోవాలి. గతంలో నాకున్న గుర్తింపును మళ్లీ తెచ్చుకోవాలి. కొత్త మోడలింగ్ ఒప్పందాలు చేసుకున్నాను" అని ఆమె వ్యాఖ్యానించింది. పాత మిత్రులను కలుస్తున్నానని పేర్కొంది. 

More Telugu News