Chiranjeevi: చిరంజీవే ఏమీ చేయలేకపోయాడు... పవన్ వల్ల ఏం అవుతుంది?: చినరాజప్ప కీలక వ్యాఖ్యలు

  • ప్రజారాజ్యం పార్టీకే భయపడలేదు
  • బీజేపీ నాటకంలో జగన్, పవన్
  • తిరుమలలో చినరాజప్ప

ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవికే తమ పార్టీ భయపడలేదని, అటువంటిది జనసేన అంటూ వచ్చిన పవన్ కల్యాణ్ కు అసలు భయపడబోమని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఆడుతున్న నాటకంలో జగన్, పవన్ లు పాత్రధారులు అయ్యారని ఆరోపించిన ఆయన, మోదీ సూచనల మేరకు ఏపీలో రాజకీయాలను మార్చాలని వారిద్దరూ భావిస్తున్నారని అన్నారు. ప్రజలు టీడీపీ పాలనపై సంతృప్తితో ఉన్నారని, మరోసారి అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని చెప్పారు. చంద్రబాబునాయుడు భయం అన్నదే ఎరుగని నేతని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజల్లో చంద్రబాబుకు సుస్థిర స్థానం ఉందని, అది అలాగే కొనసాగుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, మరోసారి తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించారు.

More Telugu News