Madhya Pradesh: జీతం పెంచమన్న పాపానికి 100 బెల్టు దెబ్బలు కొట్టిన పెట్రోలు పంపు నిర్వాహకుడు

  • జీతం రూ.2 వేలు పెంచమన్న యువకుడు
  • పెంచేది లేదన్న నిర్వాహకుడు
  • మానేయడంతో పిలిపించి ఘాతుకం

చాలా కాలంగా ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్న ఓ యువకుడు తన జీతం పెంచమని కోరాడు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన బంకు నిర్వాహకుడు అతడిపై ప్రతాపం చూపించాడు. బెల్టు తీసుకుని వంద దెబ్బలు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ నగరంలో జరిగిందీ ఘటన.

24 ఏళ్ల అజయ్ అహిర్వార్ ఓ పెట్రోలు బంకులో గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. తనకిస్తున్న రూ.3 వేల జీతాన్ని రూ. 5 వేలకు పెంచాలని యజమాని దీపక్ సాహూని కలిసి కోరాడు. దీనికి అతడు వేతనం పెంచేది లేదని సమాధానమిచ్చాడు. దీంతో ఆ మరుసటి రోజు అజయ్ విధులకు హాజరు కాలేదు.

ఆ తర్వాతి రోజు అజయ్‌ను పిలిపించిన సాహు అతడిని ఓ పంపునకు కట్టేశాడు. సహచరుడు ఆకాశ్‌‌ నుంచి బెల్టు తీసుకుని వంద దెబ్బలు కొట్టాడు. ఇంత జరిగినా బాధితుడు అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయం తెలిసిన దళిత సంఘాలు అజయ్‌తో దగ్గరుండి పోలీసులకు ఫిర్యాదు చేయించాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దీపక్, ఆకాశ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News