Jammu And Kashmir: కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపిన ఉగ్రవాదులు!

  • నిన్న కిడ్నాప్ నకు గురైన జావేద్ అహ్మద్ దార్
  • ఈ ఉదయం గ్రామ శివార్లలో మృతదేహం
  • ఉగ్రవాదుల సమాచారం ఇచ్చాడన్న ఆగ్రహంతోనే  హత్య

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. సోఫియాన్ జిల్లాలోని ఖచ్ దోరా గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జావేద్ అహ్మద్ దార్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. నిన్న అతని కిడ్నాప్ జరుగగా, ఈ ఉదయం దన్ గామ్ ప్రాంతం వద్ద మృతదేహం లభ్యమైంది. బుల్లెట్ గాయాలతో పాటు, దారుణంగా హింసించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

కానిస్టేబుల్ జావేద్ ఇంట్లోకి నిన్న ఉదయం బలవంతంగా ప్రవేశించిన ఉగ్రవాదులు, అతని కుటుంబీకులను బెదిరించి ఈ కిడ్నాప్ నకు పాల్పడ్డారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో అదే గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టగా, వారి గురించిన సమాచారం జావేదే ఇచ్చాడన్న అనుమానంతో ఉగ్రవాదులు ఈ పని చేసినట్టు తెలుస్తోంది.

కానిస్టేబుల్ కిడ్నాప్ విషయాన్ని తెలుసుకున్న అధికారులు, ఈ ప్రాంతంలో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అతని డెడ్ బాడీని ఈ ఉదయం కనుగొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. 

More Telugu News