Prakasam District: 15 ఏళ్ల పాటు వివాహేతర బంధం నడిపి, ప్రియుడిని హత్య చేసిన ప్రకాశం జిల్లా మహిళ!

  • తనకన్నా ఆరేళ్ల వయసు తక్కువ వ్యక్తితో సంబంధం
  • వద్దని చెప్పినా వినకుండా ఇంటికి వస్తున్న వ్యక్తి
  • హత్య చేసిన మహిళ అరెస్ట్

  తనకన్నా ఆరేళ్ల చిన్నవాడితో దాదాపు 15 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం నడిపిన ఓ మహిళ, అతన్ని హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా దేశాయిపేటలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పంచాయతీ పరిధిలోని శాంతి నగర్ కు చెందిన పింజల బాల చంద్రశేఖరరావు (39)కు రామానగర్‌ కు చెందిన ఓ మహిళ (45)తో వివాహేతర బంధం ఉంది. ఇద్దరికీ వారి పెళ్లికి ముందునుంచే పరిచయం ఉంది.

చంద్రశేఖర్ రావు తన భార్యతో గొడవపడి దూరంగా ఉంటూ గుంటూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా ప్రియురాలి వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఇటీవల తన ప్రియురాలి వద్దకు వచ్చినప్పుడు ఇక ఈ సంబంధం వద్దని ఆమె చెప్పగా, వినలేదు. ఇదే విషయమై చంద్రశేఖర్ అన్నకు ఫిర్యాదు చేసి, తన తమ్ముడికి సర్దిచెప్పాలని కూడా కోరింది.

ఈ క్రమంలో గత రాత్రి చంద్రశేఖర్ అమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. ఆపై తెల్లవారుజామున రోడ్డుపై అతని మృతదేహం పడివుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అతని ప్రియురాలి ఇంటికి వెళ్లగా, అక్కడ రక్తపు మరకలతో ఉన్న చీర కనిపించింది. ఒంగోలు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ కూడా ఆ ఇంటికే వెళ్లడంతో ఆమెను అరెస్ట్ చేశారు. నిందితురాలు ఒక్కతే హత్య చేసిందా? మరెవరైనా సాయపడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మృతదేహాన్ని చీరాల ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

More Telugu News