Murder: "మీ అమ్మ చావాలి" అని తండ్రి అనగానే తల్లిని చంపేసిన కొడుకు!

  • కన్న తల్లిని కిరాతకంగా హత్య చేసిన కుమారుడు
  • ఆర్థిక ఇబ్బందులు పెరగడమే కారణం
  • ప్రేరేపించాడన్న నేరంపై తండ్రి కూడా అరెస్ట్

నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన కన్న తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కొడుకు కేసులో విచారిస్తున్న పోలీసులు మరిన్ని నిజాలను వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్, ఎస్సార్ నగర్ లో కలకలం రేపిన ఈ కేసులో తల్లి మమతను హత్య చేసిన కుమారుడు మదన్ శ్రీకర్ వెనుక తండ్రి శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నట్టు పోలీసులు తేల్చారు. అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ల ద్వారా వచ్చే అద్దెలతో హ్యాపీగా జీవిస్తున్న వీరి కుటుంబం చిట్టీల వ్యాపారం మొదలు పెట్టిన తరువాత నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో రెండు వారాల క్రితం మమత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది కూడా.

తనపై కూడా అప్పుల వాళ్ల ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో, నాలుగు రోజుల క్రితం మదన్ తన చేయిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించిన శ్రీనివాస్ యాదవ్, "చావాల్సింది నువ్వు కాదు. చంపాల్సింది మమతను" అని అనడంతో, తల్లిని హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు మదన్.

మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మదన్, నానమ్మకు తెలియకుండా మాట్లాడాలంటూ, తల్లిని టెర్రస్ పైకి తీసుకెళ్లి, ఇంటి పరువు తీస్తున్నావని ఆగ్రహంతో అరుస్తూ, తలపై రాడ్ తో కొట్టి, తల్లి గుండెలపై కూర్చుని గొంతు నులిమి హత్య చేశాడు. అదే సమయంలో ఓ వివాహ వేడుకల్లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి, పోలీసులకూ కబురు పెట్టాడు. ఈ హత్యకు కుమారుడిని ప్రేరేపించిన శ్రీనివాస్ యాదవ్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News