Vijayawada: విజయవాడలోని అంగన్ వాడీ సెంటర్ లో వికటించిన టీకాలు.. చిన్నారులకు అస్వస్థత

  • 10 నెలల చిన్నారులకు నాల్గో విడత టీకాలు
  • టీకాలు వేసిన కొద్ది సేపటికే చిన్నారులకు వాంతులు, విరేచనాలు
  • చిన్నారులను ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు

విజయవాడలోని ఓ అంగన్ వాడీ సెంటర్లో చిన్నారులకు వేసిన టీకాలు వికటించడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ చిన్నారులను వారి తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక కేఎల్ రావు నగర్ పార్కు ఎదురుగా ఉన్న అంగన్ వాడీ సెంటర్ లో 10 నెలల చిన్నారులకు తల్లిదండ్రులు నాల్గో విడత టీకాలు వేయించారు. అయితే, ఈ టీకాలు వేసిన కొద్ది సేపటికే చిన్నారులకు వాంతులు, విరేచనాలతో పాటు నోటి నుంచి నురగ వచ్చింది.

దీంతో, ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం స్థానిక నోరి ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ సంఘటనపై అంగన్ వాడీ సెంటర్ సభ్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని చిన్నారుల తల్లిదండ్రులు వాపోయారు.

More Telugu News