India: సై... 'రా' పాకిస్థాన్ అంటున్న భారత్... నేడు దుబాయ్ లో కబడ్డీ పోటీ!

  • దుబాయ్ లో కబడ్డీ మాస్టర్స్ టోర్నీ
  • ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇండియా
  • నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్

క్రికెట్ అయినా, కబడ్డీ అయినా... చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తో పోటీ అంటేనే భారతీయుల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రెండు దేశాల మధ్యా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ టోర్నీల్లో మినహా మరెక్కడా తలపడటం లేదు. నేటి నుంచి దుబాయ్ లో కబడ్డీ మాస్టర్స్‌ టోర్నీ జరగనుండగా, భారత జట్టు తన తొలి మ్యాచ్ పాక్ తో ఆడనుంది. ఈ టోర్నీలో ఫేవరెట్ జట్టుగా ఇండియా బరిలోకి దిగుతుండగా, కబడ్డీ ప్రపంచంలో బలమైన జట్లుగా పేరున్న పాకిస్థాన్‌, ఇరాన్‌, కొరియా వంటి జట్లు కూడా ఉన్నాయి.

ఆసియా క్రీడలకు ముందు ఈ టోర్నీలో విజయం సాధించి మానసికంగా బలపడాలని భారత్ భావిస్తోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ లో పాక్‌, కెన్యా, భారత్‌ గ్రూప్‌- ఎలో ఉండగా, ఇరాన్‌, కొరియా, అర్జెంటీనా జట్లు గ్రూప్-బీలో ఉన్నాయి. అజయ్‌ ఠాకూర్‌ సారథ్యంలో భారత్‌ జట్టులో రాహుల్‌ చౌదరి, పర్దీప్‌ నర్వాల్‌, రోహిత్‌ కుమార్‌, రిషాంక్‌ దేవడిగ, మోను గోయత్‌, దీపక్‌ హుడా, మంజీత్‌ చిల్లర్‌, సురేందర్‌ నాడా, గిరీష్‌ ఎర్నాక తదితరులు ఉన్నారు. నేటి రాత్రి 8 గంటలకు జరగనున్న మ్యాచ్ ని స్టార్‌ స్పోర్ట్స్‌ చానల్ లో లైవ్ చూడవచ్చు.

More Telugu News