USA: అమెరికాలో తారల చీకటి బాగోతాన్ని బయటపెట్టిన చిత్తు కాగితం!

  • టాలీవుడ్ లో సెక్స్ రాకెట్ కలకలం
  • కిషన్ దంపతులను అరెస్ట్ చేసినప్పుడు పలు పత్రాలు స్వాధీనం
  • వాటిల్లో మారియట్ లెటర్ హెడ్ పై కొన్ని రాతలు
  • అవి చూసిన తరవాతే వ్యభిచార దందా బట్టబయలు

అమెరికాలో వెలుగుచూసి, టాలీవుడ్ లో కలకలం రేపుతున్న హీరోయిన్ల సెక్స్ రాకెట్ లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారి మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. అక్కడ సాగుతున్న వ్యభిచార దందాపై ఓ పేపర్ లో ఉన్న వివరాలను చూసిన పోలీసులకు అనుమానం రాగా, ఆ వివరాల ఆధారంగానే మోదుగుమూడి కిషన్, చంద్రకళ ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆపై మొత్తం దందా గురించిన సమాచారం బయటకు వచ్చిందని అధికారులు అంటున్నారు.

గురువారం నాడు కిషన్ దంపతులను ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టి, అభియోగాలపై విచారణను ప్రారంభించనున్నామని, ఆపై నెల రోజుల వ్యవధిలోగా కేసు కొలిక్కి వస్తుందని విచారిస్తున్న అధికారులు తెలిపారు. వారు చేసిన నేరాలపై కీలక ఆధారాల కోసం చూస్తున్నామని, అవి లభిస్తే, విచారణ సులువవుతుందని, శిక్ష పడితే మాత్రం అది పూర్తయిన తరువాత వారిని దేశం నుంచి పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతం వ్యభిచార దందాలో ఆరుగురి పేర్లు బయటకు వచ్చాయని, వీరిని సాక్షులుగా పేర్కొంటామని చెప్పిన అధికారులు, కిషన్ దంపతుల ఫోన్లను విశ్లేషిస్తున్నామని, ఈ దందాలో మరింత మంది ప్రమేయం ఉండవచ్చని అన్నారు.

వాస్తవానికి ఈ సంవత్సరం జనవరిలో కిషన్ దంపతులను యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది, అక్రమంగా నివసిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ చేయగా, ఫిబ్రవరి 23న వారు బయటకు వచ్చారు. వారిని అరెస్ట్ చేసిన సమయంలో వారి నుంచి అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోగా, అందులో మారియట్ హోటల్ లెటర్ హెడ్ తో ఉన్న పేపర్ ఒకటి ఉంది. దానిలో చేత్తో రాసిన కొన్ని అక్షరాలు ఉన్నాయి. హీరోయిన్ ల పేర్లు, తేదీలు, రూమ్ నంబర్ లు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులకు, ఈ వివరాలు వ్యభిచారానికి సంబంధించినవేనన్న అనుమానం వచ్చింది. ఆపై కోర్టు అనుమతితో కిషన్ ఇంట్లో సెర్చ్ చేయగా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన వివరాలున్న డైరీలు, భారీ ఎత్తున కండోమ్స్ లభించాయి. వీటిని చూసిన తరువాతే అధికారులు అన్ని ఎయిర్ పోర్టులనూ అలర్ట్ చేసి, అమెరికాలో కాలు పెడుతున్న ప్రతి టాలీవుడ్ హీరోయిన్ నూ గుచ్చి గుచ్చి ప్రశ్నించడం ప్రారంభించారు.

More Telugu News