t-cmo: నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించిన తెలంగాణ సీఎంఓ అధికారులు

  • నర్సాపూర్ అడవి పునరుజ్జీవానికి ముమ్మర ప్రయత్నాలు
  • మెదక్, సంగారెడ్డిలోని అటవీ ప్రాంతంలో పర్యటించిన అధికారులు
  • అడవిని కాపాడుతూ, ఎకో టూరిజం కేంద్రాల అభివృద్దికి చర్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో సీఎంఓ అధికారులు పర్యటించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) పీ.కే. ఝా, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అటవీ శాఖ ఛీప్ కన్జర్వేటర్ ఏ.కె. సిన్హా, జిల్లా అటవీ అధికారి పద్మజా రాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ముందుగా అటవీ ప్రాంతంలో విసృతంగా పర్యటించిన ఉన్నతాధికారులు ఆ తర్వాత నర్సాపూర్ అటవీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నర్సాపూర్  అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ భూములను పరిరక్షిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలను తయారు చేశామని, వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. కోతుల బెడద నివారణకు, అటవీ ప్రాంతంలోనే కోతులు నివసించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని, త్వరలో ప్రారంభమయ్యే నాలుగో విడత హరితహారంలో కోతుల ఆహారానికి అనువైన చెట్లను అటవీ ప్రాంతంలో నాటనున్నట్లు వెల్లడించారు. 
సుమారు 3,470 హెక్టార్లలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న అటవీ భాగాన్ని పూర్తి స్థాయిలో రక్షించటంతో పాటు ఆ ప్రాంతం గుండా పర్యటించేవారికి ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 40 కిలో మీటర్ల పొడవునా అటవీ ప్రాంతాన్ని కవర్ చేస్తూ సీ త్రూ వాల్ ను ( అడవి కనిపించేలా ) నిర్మించనున్నారు. దీనివల్ల అడవి ఆక్రమణలకు గురికాకుండా ఉండటంతో పాటు, సహజమైన అడవిని కాపాడుకునే చర్యలకూ ఉపయోగపడుతుందని నిర్ణయించారు. నర్సాపూర్ పట్టణానికి సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కుతో పాటు ఎకో టూరిజం కేంద్రాన్ని కూడా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న చెరువును కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News