gandhi bhavan: ఏపీలో భద్రాద్రి రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి: పొంగులేటి

  • ఆ గ్రామాలను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ సుముఖంగా ఉంది
  • ఈ విషయమై కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు
  • ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు

తెలంగాణలోని భ్రదాచలం ఆలయానికి సంబంధించిన ఆస్తులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, భద్రాద్రి రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ ఈ విషయమై కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.

ఏపీలో ఆ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ అంశం గురించి ప్రస్తావించారు. బయ్యారంలో స్టీల్ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ అన్యాయంగా ఉందని మండిపడ్డారు. ఈ ప్లాంట్ విషయమై కేంద్రానికి, కేసీఆర్ కు మధ్య  జరిగిన రహస్య ఒప్పందమేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తమపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. విభజన చట్టంలోని హామీల అమలు గురించి ప్రధాని మోదీ వద్ద బీజేపీ నేతలు ఒక్కసారైనా మాట్లాడారా? అని ఎద్దేవా చేశారు.

More Telugu News