nityananda: నిత్యానంద వద్దకు వెళ్లిన నా భార్య తిరిగి రాలేదు... రక్షించండి: భర్త ఫిర్యాదు

  • బెంగళూరులోని ఆశ్రమానికి నా భార్య, కుమారుడు వెళ్లారు
  • పోలీసులు నా కుమారుడిని తీసుకొచ్చారు
  • నా భార్య మాత్రం ఇంకా అక్కడే ఉంది

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిత్యానంద ఆశ్రమం నుంచి తన భార్యను విడిపించాలంటూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నమక్కల్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశాడు. తన భార్య, కుమారుడు కొన్ని నెలల క్రితం బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారని, ఆ తర్వాత వారు తిరిగి రాలేదని పిటిషన్ లో బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి ఇప్పటికే నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశానని... బెంగళూరుకు వెళ్లిన పోలీసులు తన కుమారుడిని విడిపించారని తెలిపాడు. కానీ, తన భార్య ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదని వాపోయాడు.

తన భార్య పేరిట ఓ బ్యాంకులో రూ. 5 లక్షల రుణం, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ. 5 లక్షల అప్పు, నగలపై రూ. 30 వేల రుణం, బయటి వ్యక్తుల వద్ద తీసుకున్న రుణాలు రూ. 11 లక్షల వరకు ఉన్నాయని... ఇదంతా ధ్యాన తరగతులకు ఖర్చు చేసినట్టు బాధితుడు తెలిపాడు. బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అప్పు చెల్లించాలని వేధిస్తున్నారని... ఈ నేపథ్యంలో, గత ఎనిమిది నెలలుగా మానసిక వేదనను అనుభవిస్తున్నానని చెప్పాడు. తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని... తన భార్యను నిత్యానంద నుంచి విడిపించాలని కోరాడు. 

More Telugu News