Chandrababu: జగన్‌ను మీరైనా అక్కడికి తీసుకెళ్లి చూపించండయ్యా!: జర్నలిస్టులతో చంద్రబాబు

  • జగన్ కళ్లకు ఇసుక తప్ప మరేమీ కనిపించడం లేదు
  • దేశంలోని ఏదైనా ఓ గ్రామానికి జగన్‌ను తీసుకెళ్లండి
  • అక్కడ, ఇక్కడి  అభివృద్ధిని చూపించండి

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వదిలేసి, ఎక్కడో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతోందని జగన్ నిత్యం ఆడిపోసుకుంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనైనా ఇంత అభివృద్ధి జరుగుతోందా? అన్న విషయాన్ని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఈ సందర్భంగా జర్నలిస్టులను ఓ కోరిక కోరారు. దేశంలోని ఏవైనా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసుకుని, అందులో ఓ గ్రామానికి ప్రతిపక్ష నేత జగన్‌ను తీసుకెళ్లి చూపించాలని సూచించారు. ఏపీ కంటే ఎక్కువ సంక్షేమం, మనకంటే బాగున్న గ్రామం ఉంటే చెప్పాలని అన్నారు. అభివృద్ధిని వదిలేసి ఎక్కడో ఏదో జరిగిపోతోందని జగన్ విమర్శిస్తున్నారని అన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకటి రెండు చోట్ల ఇటువంటివి జరగడం సహజమన్నారు.

తాను పాదయాత్ర చేసిన సమయంలో ఏ గ్రామంలోకి వెళ్లినా ఎండాకాలంలో దుమ్ము, వర్షాకాలంలో బురద కనిపించేవన్నారు. ఇప్పుడన్నీ సిమెంట్ రోడ్లు  వేశామన్నారు. అలాగే,  అప్పట్లో రోడ్లకు ఇరువైపులా బహిరంగ మలవిసర్జన ఉండేదని, కానీ ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ వందశాతం మరుగుదొడ్లు నిర్మించినట్టు వివరించారు. త్వరలోనే 19 లక్షల ఇళ్లను పూర్తిచేయబోతున్నామని, రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశామని చంద్రబాబు తెలిపారు.

More Telugu News