Surendra Singh: ప్రభుత్వ అధికారులకన్నా వ్యభిచారిణులు నయం: బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్!

  • మరోసారి వార్తల్లో యూపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్
  • వ్యభిచారిణిలు డబ్బు తీసుకుని పని చేసిపెడతారని వ్యాఖ్య
  • ప్రభుత్వ అధికారులు డబ్బు తీసుకున్నా పని చేయడం లేదని విమర్శలు

"ఎవరైనా లంచం అడిగితే, వారిపై పిడిగుద్దులు గుద్దండి" అంటూ తన మద్దతుదారులకు వివాదాస్పద సలహాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్, ఈ దఫా ఇంకాస్త ఘాటైన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ అధికారులకన్నా వ్యభిచారిణిలు నయమని అన్నారు. వారు డబ్బు తీసుకుని, కనీసం చేయాల్సిన పని చేస్తారని, అవసరమైతే డ్యాన్సులు కూడా చేస్తారని, అధికారులు మాత్రం డబ్బు తీసుకుని కూడా పని చేసి పెట్టరని, వారు పని చేస్తారన్న గ్యారెంటీ కూడా ఉండదని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఇదే సురేంద్ర సింగ్, ఇటీవల మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆమె రావణాసురుడి చెల్లెలు శూర్పణకని వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. ఆమె పాలనలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మరో జమ్మూ కాశ్మీర్ లా మారుతుందని కూడా అన్నారు. అంతకుముందు ఎవరూ ముగ్గురు బిడ్డల తల్లిని రేప్ చేయరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.

బీజేపీ నాయకులు మీడియాకు 'మసాలా' వార్తలు అందించడం మానుకోవాలని గత నెలలో తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ తీసుకున్నా నేతలింకా మారకపోవడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో, వీరి వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో అత్యాచారాలు పెరగడానికి మొబైల్ ఫోన్లు, అమ్మాయిలు వేసుకునే దుస్తులే కారణమని ఓ నేత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News