nipah virus: నిపా వైరస్ గబ్బిలాల నుంచి రాలేదు... పరీక్షల్లో నిర్ధారణ... అయోమయంలో వైద్యులు

  • భోపాల్ లోని జంతు వ్యాధుల పరీక్షా కేంద్రానికి నమూనాలు
  • పురుగులు తినే గబ్బిలాల కారణంగా వ్యాధి రాలేదని నిర్థారణ
  • పండ్లు తినే గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించనున్న నిపుణులు

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కు గబ్బిలాలు కారణమని ఇప్పటి వరకు భావిస్తుండగా, వైద్య పరీక్షల్లో భిన్న ఫలితం వచ్చింది. కేరళలో ఈ వైరస్ కారణంగా 12 మంది మరణించిన విషయం తెలిసిందే. మొట్టమొదటగా ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన సబిత్ ఇంటి ఆవరణలోని బావిలో ఉన్న గబ్బిలాల నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరించి భోపాల్ లోని జంతు వ్యాధుల పరీక్షా కేంద్రానికి పంపించారు.

మొత్తం 21 నమూనాలను గబ్బిలాలతోపాటు ఇతర జంతువుల నుంచి సేకరించి పంపారు. అందులో మూడు నమూనాలు గబ్బిలాలవి. అయితే, నమూనాలు సేకరించిన గబ్బిలాలు పురుగులు తినేవని, వీటి కారణంగా వైరస్ రాలేదని, వాటిలో వైరస్ కారకాలు లేవని వైద్యులు తేల్చారు. దీంతో వైరస్ ఎలా వచ్చిందన్న దానిపై వైద్యుల్లో అయోమయం నెలకొంది. దీంతో పుణె వైరాలజీ ఇనిస్టిట్యూట్ నిపుణులు రేపు కేరళలోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అసలు కారణాలను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. పండ్లను తినే గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించనున్నారు.

More Telugu News