Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలు మూర్ఖత్వానికి నిదర్శనం: ఏపీ మంత్రి ఆనందబాబు

  • బస్సుయాత్రలో నాలుగు రోజులకే పవన్ కల్యాణ్ అలసిపోయారు!
  • కిడ్నాప్ చేసేందుకే కరెంట్ తీశారన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
  • విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
  • జగన్ కు అధికారం ఎండమావే!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బస్సుయాత్రలో నాలుగు రోజులకే అలసిపోయిన పవన్ కల్యాణ్, రాష్ట్రాన్ని ఇక ఏ విధంగా పరిపాలించగలరని విమర్శించారు. తనను కిడ్నాప్ చేసేందుకే టీడీపీ వాళ్లు కరెంట్ తీశారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఆయన హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, తమ పార్టీ నాయకులపై మాట్లాడేటప్పుడు విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యలు చేయాలని అన్నారు. ఏపీలో అలజడి సృష్టించేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని, జగన్ కు అధికారం ఎండమావిగానే మిగులుతుందని అన్నారు.

కాగా, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్దానం సమస్యపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. టీడీపీ వాళ్లు తనను కిడ్నాప్ చేసేందుకే కరెంట్ తీశారన్న పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా మహానాడు గురించి ప్రస్తావించారు. ఈ నెల 27,28న డల్లాస్ లో ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో మహానాడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News