kishore das: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హాస్య నటుడు కిషోర్ దాస్

  • ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తోంది
  • కర్ణాటకలో ఆ పార్టీకి ఓట్లు తగ్గడానికి కారణం కూడా అదే
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలం ఎదురుకానుంది

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి నూకలు చెల్లిపోతాయంటూ టాలీవుడ్ హాస్య నటుడు కిషోర్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తున్న ఆ పార్టీకి ప్రజలు గడ్డి పెడతారని అన్నారు. ఏపీ గురించి ప్రధాని మోదీ అనేక వేదికలపై ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ తర్వాత తుంగలో తొక్కారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు తక్కువగా రావడానికి కారణం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమేనని చెప్పారు.

ఏపీ బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నారని... వచ్చే ఎన్నికల్లో వారికి గడ్డుకాలం ఎదురుకానుందని కిషోర్ దాస్ జోస్యం చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేలుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు కోస్తా బిడ్డగా తాను తన ఆవేదనను తెలియజేస్తున్నానని చెప్పారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా ప్రత్యేక హోదా గురించి ఆలోచిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమాన్ జంక్షన్ లో మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 

More Telugu News