Chandrababu: అన్ని ప్రాంతీయ పార్టీలతోనూ మాట్లాడేందుకు వెళుతున్నా: చంద్రబాబు

  • రేపు బెంగళూరుకి వెళుతున్నా
  • రాష్ట్ర హక్కులు కాపాడుకునేందుకు మద్దతు తీసుకుంటా
  • రాబోయే ఏడాది చాలా ముఖ్యం
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి

రేపు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను రేపు బెంగళూరుకి వెళుతున్నానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడుకునేందుకు అందరి మద్దతు తీసుకునేందుకు వెళుతున్నానని, అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడతానని చెప్పారు.

ఈ రోజు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ప్రజలంతా బయటకు రావాలని, అలా చేస్తే కేంద్ర ప్రభుత్వం తోక ముడుచుకుంటుందని చెప్పారు. రాబోయే ఏడాది చాలా ముఖ్యమని, రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీ గెలవాలని అన్నారు. తనపై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి తనను విమర్శిస్తున్నారని అన్నారు.

తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, అప్పట్లో 9 ఏళ్లు సీఎంగా పని చేశానని, ఆ తరువాత 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని అన్నారు. తనపై ఎన్నో కేసులు పెట్టాలని చూశారు కానీ ఒక్కటి కూడా నిలబడలేదని అన్నారు. చెప్పుడు మాటలు నమ్మొద్దని, మరో పదేళ్లు కష్టపడి పని చేస్తే దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు.

More Telugu News