modi: ‘మోసకారి మోదీ 4 ఏళ్ల రాక్షస పాలన’ పోస్టర్ ఇది: రఘువీరారెడ్డి

  • మోదీ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అబద్ధాలు చెప్పారు
  • అవినీతి, మోసాలే కాకుండా ప్రజలను వంచించారు
  • దీనిని నిరసిస్తూ ఈ నెల 26న రణ శంఖారావం నిర్వహిస్తాం

ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అబద్ధాలు చెప్పారని, అవినీతి, మోసాలకు పాల్పడటమే కాకుండా ప్రజలను వంచించారని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాభవన్ లో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు, పున్నర్నిర్మాణ చట్టంలోని అంశాలను అమలు చేయకుండా ద్రోహం చేశారని, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. విదేశాల్లో, దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పిన మోదీ హామీ పెద్దజోక్ గా మారిపోయిందని, నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాని బ్యాంకు అకౌంట్ కు రూ.15 లక్షలు చొప్పున డిపాజిట్ చేస్తామన్న హామీతో ఓట్లు పొంది ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పెద్దనోట్లు రద్దు చేసి పెద్దస్కామ్ కు పాల్పడ్డారని, స్వతంత్రంగా వ్యవహరించే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ను భ్రష్టుపట్టించారని, జీఎస్ టీ (గబ్బర్ సింగ్ ట్యాక్స్) అమలు చేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఒక్కమాటలో చెప్పాలంటే..భారత ప్రజాస్వామ్యంపైన దాడి చేస్తూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో మోదీ రాక్షసపాలన సాగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోసకారి మోదీ నాలుగేళ్ల రాక్షసపాలనను నిరసిస్తూ ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా రణ శంఖారావం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు.

More Telugu News