Karnataka: కుమారస్వామి కోసం బెంగళూరుకు వెళ్లనున్న కేసీఆర్, చంద్రబాబు!

  • బుధవారం నాడు కుమారస్వామి ప్రమాణ స్వీకారం
  • హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
  • పలువురు వీఐపీలు హాజరయ్యే అవకాశం

బుధవారం నాడు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. వీరిరువురికీ కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానాలు పంపగా, తాము బయలుదేరి వస్తున్నట్టు కేసీఆర్, చంద్రబాబులు స్పష్టం చేశారు. ఇక బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలనందరినీ కుమారస్వామి బెంగళూరుకు ఆహ్వానించారు.

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులనూ కుమారస్వామి స్వయంగా ఆహ్వానించారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం వీవీఐపీలు, వీఐపీలతో నిండిపోనుందని తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో ఈలోగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారు. నేడు ఢిల్లీకి బయలుదేరే ఆయన, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలసి మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News