Karnataka: కర్ణాటక బీజేపీదే అన్న ఆనందంలో దూసుకెళ్లిన సెన్సెక్స్!

  • ఓ దశలో 420 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్
  • 36 వేల మార్క్ కు చేరువలో సూచిక
  • 115 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

కర్ణాటకలో బీజేపీ ఆధిక్యంలో ఉందన్న వార్తలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకెళ్లాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వేళ, క్రితం ముగింపు వద్దే ఉన్న బెంచ్ మార్క్ సూచికలు, ఫలితాల సరళి బీజేపీకి అనుకూలంగా మారుతున్న సంకేతాలతో పాటే పైకి లేచాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఉత్సాహంగా నూతన కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్ 420 పాయింట్లకు పైగా లాభపడింది.

ఈ ఉదయం 10.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 417 పాయింట్ల లాభంతో 35,973 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 115 పాయింట్లు పెరిగి 10,921 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో 9 కంపెనీలు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, టైటాన్ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఐఓసీ, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

More Telugu News