Karnataka: బీజేపీ కాళ్లు పట్టుకుంటూ వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోంది!: సోమిరెడ్డి

  • ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం
  • దేశంలో అత్యయిక పరిస్థితి కంటే ఘోరమైన పాల
  • వైసీపీ మీడియా దుష్ప్రచారం

తమ మీడియాలో ఏపీపై అసత్య వార్తలు రాస్తూ వైసీపీ నేతలు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో అన్ని ప్రాజెక్టుల్లోకెల్లా పోలవరం ప్రాజెక్టు పనులే వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ఆ ప్రాజెక్టు పనులు జరగకూడదని కొందరు కుట్ర చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.

పట్టిసీమ నీటివల్ల మూడేళ్లలో  రైతులు ఎంతో ప్రయోజనాలను పొందారని సోమిరెడ్డి చెప్పారు. పట్టిసీమ లేకపోతే 146 టీఎంసీల నీళ్లు రాయలసీమకి ఎలా వచ్చేవని ప్రశ్నించారు. శాసనసభలో ఆనాడు పట్టిసీమను వ్యతిరేకించారని అన్నారు. నిన్న తిరుపతిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటనను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఖండించారని చెప్పారు.

నిన్న నేషనల్ మీడియా, సోషల్ మీడియా అంతా అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు ఆయన అనుచరుడు బీ శ్రీరాములు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్లుడితో డీల్ మాట్లాడుతున్న వీడియోలను ప్రసారం చేస్తోంటే సాక్షిలో ఒక్క ముక్క కూడా ఆ ఘటనను చూపలేదు, రాయలేదని అన్నారు. అమిత్‌ షాపై రాళ్లదాడి ఘటనపై మాత్రమే దృష్టి పెట్టిందని తెలిపారు.

బీజేపీ కాళ్లు పట్టుకుంటూ వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని, మరోవైపు రాష్ట్రంలో హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్నారని అన్నారు. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కర్ణాటకలో బీజేపీ గెలుపుకోసం పనిచేస్తూ, రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక హోదా సాధిస్తామని అంటున్నారని మండిపడ్డారు. తాము ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా సిద్ధమని సోమిరెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యయిక పరిస్థితి కంటే ఘోరమైన పాలన నడుస్తోందని ఆరోపించారు.                 

More Telugu News